Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

ధ్యానమేవ ఉపాసనమ్‌

'హాజీమే నాకమూర' టోకియో విశ్వవిద్యాలయంలో ఫిలాసఫి ప్రొఫెసరు. 'మియా మొటే' అదే విశ్వవిద్యాలయంలో ఫ్రెంచిభాషను నేర్పే ప్రొఫెసరు.

'ప్రొఫెసరు నాకమూర' శంకరుల బ్రహ్మసూత్ర భాష్యమును జపానీభాషలో అనువదించుటయే కాక శంకరులకు పూర్వముఉన్న కొన్ని వేదాంత గ్రంథములను కూడ అనువదించినవారు. 'మియా మొటో' ఫ్రెంచినుండి జపానీభాషలోనికి 'రామకృష్ణ పరమహంస వివేకానందుల' జీవిత చరిత్రలను అనువదించారు. ఈ ఇరువురు భారతదేశమునకు వచ్చిన సందర్భములో కామకోటి శంకారాచార్యుల వారిని కలుసుకొన్నారు.

ప్రొఫెసరు నాకమూర గౌడపాదీయ మాండూక్యకారిక, వాక్పదీయము చదువుటయే కాక బోధాయనులు, ద్రావిడాచార్యులు మండనులు వ్రాసిన గ్రంథములు కూడ పరిశీలించినవారు. భారత దర్శనములను చైనా, టిబెట్టు దేశములలో కూడ కొంత సంగ్రహించి నాలుగు పుస్తకములుగ తయారుచేశారు. జపానులో ఒక్క శాంకరీయ గ్రంథములే కాక ఇతర సంస్కృత గ్రంథములను కూడ చాల ఆసక్తితో చదువుతున్నారని, ఐనప్పటికి 'ఖండన ఖాద్యము' వంటి గ్రంథములు కొరకు వడుట కష్టంగా ఉన్నదని స్వామి వారితో 'నాకమూర' అన్నారు. ఆయన తాము బ్రహ్మసూత్ర భాష్యమును పూర్తిగా అనువదించినా అట్టి గ్రంథములను ప్రచురించుట కష్టసాధ్యముగా ఉన్నదని అన్నారు.

తరవాత స్వాముల వారికి 'నాకమూర' గారికి యీక్రింది విధముగా సంభాషణ జరిగినది.

ప్రశ్న :- శంకరులు వ్రాసిన పుస్తకములలో 'ఉపాసన' అన్నపదము తరచు వస్తూ ఉన్నదికదా! 'ఉపాసన' అంటే ఏమిటి? అటువంటి ప్రత్యేకసాధన ఏదైనా మఠములో వాడుకలో ఉన్నదా?

స్వామి :- 'ధ్యానమేవ ఉపాసనమ్‌' 'ఉపాసన' అంటే ధ్యానమే. ధ్యానము అన్నమాట వచ్చినప్పుడు ఒక రూపకల్పన అవసరం అవుతుంది. ఉదాహరణకు రెండు చేతులుకల దైవమునో లేక ఎనిమిదిచేతులు కలిగినదై వమునో ధ్యానము చేయవచ్చును. కాని సత్యమైనది ఒక్కటే. దానిలోమార్పులేదు. అంతిమ సత్యమైన ఆరూపము నిరాకారమైనది. మనము ఏరూపమును కల్పించుకొని ధ్యానము చేస్తామో ఆమూర్తి వలన ఒక ప్రత్యేకమైన ప్రయోజనము వుంటుంది. రెండు చేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం ఒకటి. ఎనిమిది చేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం మరియొకటి. ఏ యే మూర్తులను ఏయే విధముగా ఉపాసించాలో తెలిపేవి శాస్త్రాలు. ఉపాసనలలో వైవిధ్యము ఉన్నా ప్రయోజనం ఒక్కటే. ఏదైనా అంతిమసత్యమును తెలుసుకొనుటయే. ఉపాసనలన్నీ మనస్సును ఏకాగ్రం చేయుటకు సాధనాలు.

ప్రశ్న :- మఠములో ఏదైనా ఉపాసన చేస్తున్నారా? ఐతే ఆ ఉపాసన ఏది?

స్వామి :- శాస్త్రములు ఎన్నో రకములైన ఉపాసనలను చెపుతూ ఉన్నాయి. ఆ ఉపాసనలను అన్నిటిని అనుసరించుట సాధ్యముకాదు; అవసరమూకాదు. అందుచేత ఇష్టమైన ఒకటి రెండు ఉపాసనా మార్గములను స్వీకరించి వానిని నిర్దిష్ట సమయాలలో చేస్తూ ఉంటారు. ఉపాసన వ్యక్తిగతమైనది. సామూహికమైనదికాదు. ఉపాసన క్రమానుగతముగా వచ్చిన దానిని అనుసరించియో, గురువు ప్రసాదించిన దీక్షను అనుసరించియో ఉంటుంది.

ప్రశ్న :- అద్వైత సిద్ధాంతమును చక్కగా అర్ధము చేసుకొనవలెనంటే ఏ గ్రంథము చదువవలెనని మీరు సలహా ఇస్తారు?

స్వామి :- మొదట'వివేకచూడామణి'ని పిదప 'అపరోక్షానుభూతి'ని చదువవచ్చు.

నాకమూర :- నేను విద్యారణ్యుల గ్రంథములనుకూడ చదివినాను. అందులో 'పంచదశి' ఒకటి. కాని సురేశ్వరాచార్యుల వార్తికము చాల విస్తృతముగా ఉన్నది.

స్వామి :- ఔను! బృహదారణ్యకమును శంకరుల భాష్యముతో చదువునప్పుడు సురేశ్వరుల వార్తికమును వివరణకొరకు వాడుతూ ఉంటారు. దాని తరువాత ధర్మరాజుల వేదాంత పరిభాష. సదానందుల వేదాంతసారము వచ్చినవి. మీరు 'భజగోవింద స్తోత్రము' చదివినారా?

నాకమూర :- లేదు

స్వామి :- ఆచార్యులవారి స్తోత్రములలో అన్నిటికంటె 'భజగోవిందము' నకు ప్రచారము ఎక్కువ. అసలు ఆచార్యులవారు పేరు ఎత్తుకొంటేజ్ఞాపకమువచ్చేది'భజగోవిందస్తొత్రమే' శైవులైనా, వైష్ణవులైనా అందరకు ఈస్తోత్రం అంటే చాలప్రీతి. ఇందులో నీతి, పరమార్థము రెండూ కలిసి ఉన్నాయి.

నాకమూర :- నేను శంకరుల బ్రహ్మసూత్రభాష్యము, గీతాభాష్యము రెండూ చదివాను. అందులో ఎక్కడచూచినా విష్ణుప్రశంసయే కాని శివుని ప్రసక్తి కనబడుటలేదు. కాని శాంకరీయులందరు శైవులుగా ఉన్నారు. దీనిని చూస్తేనాకు ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది.

స్వామి :- శంకరాను యాయులందరు శైవులని మీరు తలచుటకు కారణం?

నాకమూర :- వారందరు శివారాధన, భస్మధారణ చేస్తారు కనుక,

స్వామి :- మీ రడిగిన ప్రశ్న మంచిదే! మీకు తృప్తికరముగా సమాధానము చెప్పవలె నంటే కొన్ని చారిత్రక విషయాలను కూడ చెప్పాలి. శంకరులకు పూర్వము భారతదేశములో రెండేమతాలు ఉండేవి. ఒకటి ననాతన ధర్మము లేక స్మార్తమతం. రెండవది బౌద్ధము. ఒక్క భారతదేశము నందేకాక 'సయాము' కంబోడియా' దేశములలో కూడ ఇంతే. జపానులో ''గణపతి, ఇంద్రుడు, సరస్వతి''- వీరి విగ్రహములు కనబడుటచేత జపానులో కూడ ఒకప్పుడు ననాతనధర్మము ఉండి ఉండాలని తీర్మానించవలసి వస్తూ ఉన్నది.

నాకమూర :- జపానులో బౌద్ధమతమునకు ముందు 'షింటోయినం' ఉండేది. ''షింటోయినం'' అంటే బ్రాహ్మణమతమే.

స్వామి :- బౌద్ధము భారతదేశము నుండి చైనా-జపానులకు ప్రాకినది. తరువాత భారతదేశములో వేద ప్రామాణ్యమును నిలువబెట్టుటకై 'కుమారిలభట్టు' పూనుకొన్నాడు. బౌద్ధమతము నిరీశ్వరత్వమువంక మొగ్గుట చూచి 'ఉదయానాచార్యులు' దానిని ఖండించుటకు పాటుపడ్డారు. అటుపిదప శంకరభగవత్పాదులవారు వేదప్రమాణముతో బాటు ఈశ్వరభక్తిని కూడ బోధిస్తూ- సర్వము బ్రహ్మమే అన్న ప్రాతిపదికతో కూడిన జీవాత్మపరమాత్మల ఏకత్వమును

( 6 - 14 )

అద్వైతసిద్ధాంతము ద్వారా నిరూపించినారు. భారతదేశమునందు అద్వైతసిద్ధాంతము తలయెత్తగనే బౌద్ధము క్రమక్రమముగా క్షీణించసాగింది. అందరూ భగవత్పాదులు బౌద్ధమతాన్ని హిందూదేశమునుండి వెళ్ళగొట్టినారని అనుకొంటారు కాని శంకరుల భాష్యాలనుచూస్తే అందులో బౌద్ధమతఖండన చాల అరుదుగా కానవస్తుంది. ఆయన ఖండనమంతా మీమాంసమీద, సాంఖ్యము మీద సాగింది. తార్కికముగా బౌద్ధమును కుమారిలభట్టు, ఉదయానాచార్యులు ఖండించారు. అద్వైతమతవ్యాప్తికి వీరి కృషి ఎంతయో తోడ్పడింది.

ఇక ఉపాసన విషయము ఎత్తుకొంటే ప్రజలు కులాచారమును పాటిస్తూ విష్ణువును, శక్తిని ఉపాసించేవారు. భగవత్పాదులవారు కూడ వైదికవిధానములో కులాచారముగా వచ్చిన పూజలనే చేయుమన్నారు. ఆయన వరకు ఆయన అద్వైతి. అద్వైతసిద్ధాంతానుసారము పరమాత్మ ఒక్కడే. శక్తి, శివుడు విష్ణువు- అంతా ఆ పరమాత్మయే. వైష్ణవులలో కొందరు తీవ్రవైష్ణవులు శివాలయములోనికి తొంగిచూడకపోయిన అద్వైతానుయాయులుగా ఉండేవారు. వారికి భస్మధారణ లేదు. వారందరు త్రిపుండ్రాంకితులైన విష్ణుభక్తులే. కాని శంకరమతమును పాటిస్తూ అద్వైతులై ఉండేవారు. భస్మధారణచేసే శైవులలోకూడ శంకరులను అనుసరించిన అద్వైతులు ఉండేవారు. కాని ఇప్పుడు వైష్ణవులలో అద్వైతుల సంఖ్య తక్కువ. అందుచేతనే అద్వైతులందరు శైవులే అన్న భావం నెలకొన్నది.

శంకరులకు పిదప వైష్ణవాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్యులు వచ్చుటతో అద్వైతులైన వైష్ణవులు వీరి మతాలలో ఏదో ఒక దానిని అనుసరించుటకు ఆరంభించారు. శంకరులను అనుసరిస్తూ మిగిలినవారు దాదాపు శైవులే అయినారు. ఇప్పటికి కూడ వైష్ణవులలో కొందరు అద్వైతులు ఉన్నారు. వారు శివాలయాలకు వెళ్ళకపోయినా నన్ను శంకరాచార్యులని గౌరవిస్తారు. వీరికీ అద్వైతమును పాటించని వైష్ణవులకంటె శివునియెడ విముఖత యెక్కువ. అద్వైతులలో ఎక్కువమంది శైవులనుటకు పైన చెప్పినదే కారణము.

ఇక మఠవిషయము ఎత్తుకొంటే మఠమునుండి ఏ శ్రీముఖము జారీచేసినా, కడపట 'నారాయణ స్మ్యతిః' అని విష్ణుస్మరణలో అంతము అవుతుంది. కాని నేను భస్మను అలదుకొని శివపూజ చేస్తూవుంటాను. ఎవరైనా నాకు నమస్కరిస్తే 'నారాయణ - నారాయణ' అని నారాయణ స్మరణ చేస్తాను.

సంభాషణలో వచ్చిన బోధాయనుల ప్రసక్తి జ్ఞప్తికి తెచ్చుకొనిొ బోధాయనుల వ్రాతప్రతులు మీకు ఏమైన లభించినవా?

నాకమూర :- ఆ(! నా వద్ద కొన్ని వార్తికము లున్నాయి. అవి ఉపవం్షులు వ్రాసినవి. ఉపవం్షులనే బోధాయనులుగా పరిగణిస్తున్నారు. నేను ఆత్రేయబ్రహ్మనంది కృతులను, ద్రావిడాచార్యుల గ్రంథాలను చూచాను. వైష్ణవ గ్రంథాలు 'ద్రామిడాచార్యులనియు' అద్వైత గ్రంథములు 'ద్రావిడాచార్యులు' అనియు వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణము ఏమిటి?

స్వామి :- 'ద్రావిడము, ద్రామిడము' అన్నవి పర్యాయపదములు, కాని ఔత్తరాహులు 'ద్రావిడము' నకు బదులు 'ద్రావిడము' అనియే వాడుతూ ఉంటారు.

నాకమూర :- భారతదేశములో ఇంత పరమత సహనము ఉండుటకు కారణము అద్వైతమే అని అనుకొంటాను. మీ రేమంటారు?

స్వామి :- వాస్తవమే.

నాకమూర :- భారతదేశంలో పండితులలో అధికసంఖ్యాకులు అద్వైతము పఠిస్తారని అనుకొంటాను. ఔనా!

స్వామి :- అదికూడ నిజమే! అవును. జపానులో సంస్కృత భాషాభ్యాసము ఎలా ప్రారంభ##మైనది?

నాకమూర :- బౌద్ధమతవ్యాప్తితో బౌద్ధులకు సంస్కృతము నేర్చుకొన వలసిన అవసరము కలిగింది. సంస్కృతముపై ఆసక్తి పుట్టుకొని వచ్చింది. డెబ్బది ఎనుబది యేండ్లక్రితం జపానునుండి కొందరు 'ఆక్సుఫర్డు' విద్యాలయానికి వెళ్లారు. అక్కడ 'మాక్సుమూలర్‌' మరియు ఇతర ప్రాచ్యభాషా ప్రవీణులయొద్ద సంస్కృతము అభ్యసించి జపానులో దానికి ప్రవేశము కలిగించారు. మరికొందరు 'జర్మనీ' లో సంస్కృతము నేర్చుకొన్నారు. జపానులో బౌద్ధ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు సంస్కృతములో కొంచెమైనా ప్రవేశము ఉండవలెనని నిబంధిస్తున్నారు.

స్వామి :- జపానులో ఎంతమంది 'రామాయణము' వంటి కావ్యాలను సంస్కృతములో చదివి అర్థము చేసుకొనగలరు?

నాకమూర :- దాదాపు ఇన్నూరుమంది ఉండవచ్చు. వారిని 'ట్యోకియో' లోనో 'క్యోటో'లోనో చూడగలము.

స్వామిలవారు :- జపానులో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?

నాకమూర :- దాదాపు రెండువందలు ఉండవచ్చును. జపానులో ప్రతికళాశాల ఒక విశ్వవిద్యాలయమే. అవిస్వతంత్రముగా పరీక్షలు పెట్టి పట్టాలను ఇస్తాయి.

స్వామి :- జపానీయ వర్ణసమామ్నాయము (అక్షరములు) సంస్కృతమును అనుసరించి ఉంటుందా? లేక చైనాభాషను అనుసరించి ఉంటుందా?

నాకమూర :- సంస్కృతములనే అనుసరిస్తుంది. మొదట అచ్చులు తరువాత హల్లులు వస్తాయి. ప్రతిఅక్షరము 'అచ్చు-హల్లుల' కలయికగా ఉంటుంది. కొన్ని చైనా అక్షరాలను కూడ వాడుతాము.

స్వామి :- ఈ అక్షర విధానము, ఇతర చారిత్రిక ఆధారాలు చూస్తే భారతదేశము, జపాను, సయాము, కంబోడియా మొదలైన దేశాలలో ఒకే మతము ఒకప్పుడు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చైనా అక్షరవిధానాన్ని వదలి సంస్కృత అక్షరవిధానము ఎందుకు మీ దేశములోపాటింపబడినది?

నాకమూర :- చైనా విధానము కూడ జపానుభాషకు ఉపకరించింది. కాని సంస్కృతవిధానము సులభము. సంస్కృత భాషాజ్ఞానము ఏకొద్దిమంది బౌద్ధభిక్షువులకు మాత్రమో వుండేది. కాని ప్రస్తుతము వాడుకలోవున్న అక్షరసమామ్నాయము జపానీయుల సృష్టీ అనియే చెప్పాలి.

స్వామి :- ఎన్ని చోట్ల హైందవ దార్శనిక శాస్త్ర పఠనకు ఏర్పాట్లు వున్నాయి.

నాకమూర :- జాతీయ విశ్వవిద్యాలయాలు పది. బౌద్ధవిశ్వవిద్యాలయాలు పది. ఇరువది చోట్ల ఈ ఏర్పాట్లు వున్నాయి.

స్వామి :- బౌద్ధమతానికి ఎన్ని చోట్ల ఏర్పాట్లువున్నాయి-

నాకమూర :- బౌద్ధమునకు అవకాశములు ఎక్కువ.

స్వామి :- బౌద్దమతమును ఏభాషలో నేర్పూతూవున్నారు?

నాకమూర :- బౌద్ధమత గ్రంథములు చదువుటకు కొంత సంస్కృతభాషా పరిచయము కావాలి. కారణం - కొన్ని ముఖ్యగ్రంథాలు సంస్కృతమునం దుండుట. కాని శిక్షణ జపానీ భాషలోనే జరుగుతుంది.

స్వామి :- జపానులో ఎక్కడనైనా శివలింగము కనబడినదా?

నాకమూర :- లేదు. శివలింగాలుకాని, విష్ణువిగ్రహాలు కాని కనిపించవు. గణపతి, సరస్వతి, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతల విగ్రహములు కనబడతాయి. మొసలిరూపములోవున్న శిల్పములు కూడ వున్నాయి. మొసలి గంగకు వాహనమని అచ్చటివారి విశ్వాసము. గణపతి, ఇంద్రుడు, సరస్వతి, వరుణుడు వీరిని జపానీ భాషలో వరుసగా ఆర్యదేవ, శక్రదేవ, వాగ్దేవతా, జలదేవత అని వ్యవహరిస్తారు.

స్వాములవారు :- మొదలు చర్చిస్తూవున్న విషయము అందుకొనిొ జ్ఞానమువేరు ఉపాసనవేరు. ఉపాసనలో మానసికకర్మ ఉన్నది. కాన జ్ఞానము మానసిక భూమికకు చేరినదై నప్పటికీ అందులో కర్మలేదు. ఒక విధిని అనుసరించిచేయబడునదియే కర్మ. జ్ఞానోదయముతో మనస్సు దానిలోనే నిలిచిపోయి ఏవిధినీ అనుసరించదు. ఆ విధి బాహ్యమైనను సరే! ఇంద్రియ ప్రేరణవలన ఏర్పడినదైనను సరే! ఒక చిన్న ఉదాహరణతో కర్మతత్త్వము చెప్పవచ్చును. ఇక్కడ పచ్చని అరటిపండ్లు ఉన్నాయి. నేను 'ఈ పండ్లుపచ్చన' అని అంటే మీరు అంగీకరించి ఊరకొంటారు. అది నేను 'ఎఱ్ఱగా ఉన్నవనియో నల్లగా వున్నవనియో అంటే' తత్‌ క్షణమే 'కాదు! అవి పచ్చగా ఉన్నాయి' అని అంటారు. కాని నేను 'ఈ పండ్లు ఎఱ్ఱగా ఉన్నాయి అని అనుకొనండి' అని అంటే మరల మీరుఊర కొంటారు. దీనికి కారణము ఆ విధిమీకు అర్థం అవుతూఉండుట. అందుచేత కర్మఏదైనా విధిని అనుసరించి ఉంటుంది. ఈ విధముగా ఉపాసన మానసిక కర్మయే అవుతుంది. మొదట భగవంతుడు ఈవిధముగా ఉంటాడని, ఆ విధముగా ఉంటాడని ఊహించుకొని జ్ఞానోదయమైనంతనే యథాతథముగా అర్థము చేసుకొంటారు. అటుపిమ్మట ''ఈమూర్తిని ఉపాసించు, ఆ మూర్తిని ఉపాసించు'' అనే విధులను పాటింపక పోవచ్చును.

తరువాత ప్రొఫెసర్లు ఇద్దరు స్వాములవారికి తమ ధన్యవాదములను అర్పించి సెలవు తీసుకొన్నారు.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page